Saturday, September 18, 2010

ఐ.టి కేంద్రం గచ్చిబౌలిని వేధిస్తున్న ట్రాఫిక్




                  అది హైదరాబాద్ నగరానికి  అంతర్జాతీయ పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టిన  ఐ.టి సంస్థలు కొలువుదీరిన ప్రాంతం. అక్కడ లక్షలాది ఐ.టి నిపుణులు నిరంతరం కంప్యూటర్లతో కుస్తీలు పడుతుంటారు.  ఇప్పటికే మీకు ఆ ప్రాంతమేదో తెలిసిపోయినట్లుంది. అదే మన గచ్చిబౌలి. ఇప్పుడు గచ్చిబౌలిని తీవ్రమైన ట్రాఫిక్ సమస్య వేధిస్తుంది. గచ్చిబౌలిని చేరాలంటే అష్టకష్టాలు పడాల్సిందేనని ప్రతిఒక్కరు ఒప్పుకుంటున్నారు.
     ఎందుకంటే ఇటీవల కాలంలో గచ్చిబౌలి నగరానికి కొత్త చిరునామాగా మారిపోయింది. అవుటర్ రింగ్ రోడ్డు మొదటి ఫేజ్ మొదలవటమే కాకుండా అనేక ఐ.టి సంస్థలు తమ కార్యాలయాలను ఇక్కడే ఏర్పాటుచేస్తున్నాయి. ట్రాఫిక్  విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా నానక్ రాంగూడ, ఐ.ఐ.ఐ.టి, మాధాపూర్ , హైటెక్ సిటి ప్రాంతాల్లో పనిచేస్తున్న లక్షలాది ఐ.టి ఉద్యోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్య కొత్తేమి కాకపోవచ్చు కాని ఈ విషయంలో పరిస్థితిని మెరుగుపర్చనట్లైతే కనుక  నగరం వెనుకబడే అవకాశం ఉంది. ఈ చిన్న ఉదాహరణ చూస్తే ఐ.టి. ఉద్యోగులు ఎంత విలువైన సమయాన్ని వృధా  చేస్తున్నారో ఇట్లే  అర్ధమవుతుంది.
       గచ్చిబౌలిని చేరటానికి ఉన్న ప్రధాన మార్గాల్లో వయా మెహిదీపట్నం  ఒకటి. మెహిదీపట్నం నుండి గచ్చిబౌలి జంక్షన్ కి ఉన్న దూరం కేవలం 10 కి.మీ కానీ గచ్చిబౌలి చేరటానికి పట్టే సమయం గంటన్నర. ఇది ఆఫీస్ వేళలైన ఉదయం 8 నుండి 11 వరకు మరియు  సాయంత్రం 5.30 నుండి రాత్రి  8.30 వరకు పరిస్థితి. ఈ మొత్తం సమయంలో 45 నిమిషాలను ట్రాఫిక్ భూతం హరిస్తుంది.
                మొదటగా వచ్చేది టొలిచౌకి , అక్కడ మతపరమైన కట్టడాలకు తోడు, కొంత రోడ్డు తోపుడు బండ్ల ఆక్రమణలకు గురైంది. అక్కడ ట్రాఫిక్ పోలీసులున్నా పట్టించుకోని పరిస్థితి కారణంగా 10 నిమిషాలు వృధా. తరువాత వచ్చేది దర్గా. అప్పటివరకు వెళ్ళే మార్గంలో నాలుగు వరుసలుగా ఉన్న రోడ్డు మార్గం ఒక్కసారిగా సిగ్నల్ దాటిన వెంటనే కుంచించుకుపోయింది. అక్కడ రోడ్డు మధ్యలో ఉన్న ఒక్క చికెన్ దుకాణం కారణంగా 25 నిమిషాలకు పైగా నారాయణమ్మ కాలేజ్ వరకు ట్రాఫిక్ పెరిగిపోతుంది. ఇవన్ని దాటిన వారికి మరో ట్రాఫిక్ గండం హైటెక్ సిటీ కి వెళ్ళేందుకు కొత్తగా ఏర్పాటుచేసిన రహదారి. హైటెక్ సిటీకి వెళ్ళేందుకు మరియు అక్కడనుండి వచ్చేవారు గచ్చిబౌలి వెల్లటానికి యు టర్న్   తప్పనిసరి. అక్కడ మరో 10 నిమిషాలు వృధా. ఇలా చిన్న చిన్న కారణాలవల్ల రోజుకు ఆ మార్గంలో ప్రయాణించే 20000 మంది పైగా ఉద్యోగులు ఒక సంవత్సర కాలంలో వృధా చేస్తున్న మొత్తం గంటలెన్నో తెలుసా. అక్షరాలా 72 లక్షల గంటలు.  దీనికంతటికి కారణం ట్రాఫిక్ పోలిసులు మరియు జి.హెచ్.ఎం.సి అధికార్ల నిర్లక్ష్యమే. అధికారులు తక్షణం  స్పందించి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి.           

 

No comments:

Post a Comment

India in Modi Rule 2014-24

Translate