Sunday, December 7, 2014

ఆమె నోట ప్రతి పాట ' చిత్ర 'మే!

         



              ఆమె పాటకు ప్రకృతి కూడా పరవశిస్తుంది ఇక మనిషి సంగతి కొత్తగా చెప్పాలా! మనిషి మనసుకి హాయి కలిగించే మంత్రమేదో వేస్తుంది తన పాట. కదలకుండా కూర్చున్నవారిని కూడా తక్షణం నాట్యమాడేలా ఊరిస్తుంది ఆ పాట. సరస, భక్తి, విరహ, చిలిపి, కొంటె, ప్రేమ, విషాద, మనోహర, ఆరాధన, సౌందర్య భావమేదైనా స్పష్టంగా పలికించగలదు ఆమె పాట. ఎక్కడో కేరళ రాష్ట్రంలో పుట్టినప్పటికీ ఆ పాటల ప్రవాహం తెలుగు నేలను పులకింపజేస్తూనే ఉంది. ఆమె పేరే చిత్ర. 

              చిత్ర పేరు వినని తెలుగు గాయనీ గాయకులు, తెలుగు పాటల ప్రేమికులు ఉండకపోవడం విచిత్రమే. తెలుగే కాదు, అన్ని దక్షిణాది భాషల్లో, హిందీ చిత్ర సీమలోను చిత్ర సుపరిచితురాలు. చిత్ర పాడితే ఆ పాటలో తెలుగుదనం తొణికిసలాడుతుంది. కల్లో ల మనసున్న వారు ఆహ్లాదభరితంగా అవ్వాలంటే ఔషదం ఆమె పాటే!  అదే సంగీతాన్ని అస్వాదించే మనసైతే మళ్ళీ మళ్ళీ వినాలని మారం చేస్తూ వ్యసనానికి లోనవుతుంది. తెలుగు పాటల పూతోటలో విరిసిన సిరి మల్లె చెట్టు చిత్ర పాట.  

             "తెలుసునా తెలుసునా" అంటు చెలికాడిపై ప్రేమను వ్యక్తం చేసినా, వర్షాన్ని " నువ్వొస్తానంటే నేనొద్దంటానా" అని పలకరించినా , ప్రియుడు కొట్టిన చెంప దెబ్బని "అబ్బనీ తియ్యనీ దెబ్బ" అని పొగిడినా, మనసు ఆనందభరితమైన వేళ "ఆనందమానందమాయె"  అని ఆలపించినా, " ఉలికి పడకు అల్లరి మొగుడా " అంటూ ఆట పట్టించినా , గోపాలున్ని ప్రస్తుతించినా, ఆ నంద గోపాలుడి గోపికలను "చాలును లేమ్మా నీ నిదుర" అని నిద్ర లేపినా, పెరటి జాంచెట్ల పండ్లని కుశలం అడిగినా, "మౌనంగానే ఎదగమనీ" నీతి వాక్యాలు చెప్పినా ఆ గాత్ర సౌందర్యమే సౌందర్యము. 
                              ఇక మన తెలుగులో బాల సుబ్రమణ్యం, చిత్ర పాటల జంట సృష్టించిన సంచలనం అంత ఇంతా కాదు. వాళ్ళిద్దరూ  కలిసి గానం చేసిన పాటలు వింటే బీడు భూమికి కూడా సిరులు పండించే సత్తా వచ్చినట్లుగా మనసు ఆనందంతో పునరుత్తేజితమవుతుంది, ఉబ్బి తబ్బిబవుతుంది.  

              ఇటివల మా టి.వి నిర్వహిస్తున్న సూపర్ సింగర్ కార్యక్రమానికి చిత్ర గారు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ వర్ధమాన తెలుగు గాయనీ గాయకులకు ఎన్నో అమూల్యమైన సలహాలిస్తున్నారు.స్వరాభిషేకంతో సంగీతాభిమానులను సమ్మోహనపరుస్తూనే ఉంది.అత్యద్భుతమైన ఆమె పాటను అక్కున చేర్చుకోని ప్రశంసించని ప్రభుత్వం లేదు, గుర్తించని కళా సంఘం లేదు. బహుమతులు, బిరుదులు, ప్రశంసా పత్రాలు, నందులు ఆ గాన కోకిల సిగలో లెక్కలేనన్ని. 

             భవిష్యత్లో కూడా ఎన్నెన్నో అద్భుతమైన తెలుగు పాటలు చిత్ర నోటి నుండి జాలు వారాలని, అవన్నీ తెలుగు పాటల తోటలో వాడనీ పూలుగా నిరంతరం పరిమళాలు పంచాలనీ తన పాటకి దాసోహమైన నా చిరు కోరిక.







List of Chitra Telugu Songs:

http://www.telugulyrics.org/Songs.aspx?Source=Singer&ID=30&Name=Chitra

Friday, October 10, 2014

మా ఊరి కోసం -- గురజాల అభివృద్ధి కి సూచనలు





  1. నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉన్నందున గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా సాధనకై కృషి చేయాలి.
  2. గురజాల-కారెంపుడి -వినుకొండ రహదారిని అద్దంకి నార్కెట్ పల్లి రహదారికి అనుసంధానించేలా చర్యలు తీసుకోవాలి.
  3. మాచర్ల - నల్గొండ రైల్వే లైను పనులను త్వరితగతిన పూర్తి చేసేలా రైల్వే శాఖ పైన ఒత్తిడి తేవాలి.
  4. గురజాల లో బస్ డిపో ఏర్పాటు చేయాలి. గురజాల ప్రయాణీకుల ప్రాంగణం( బస్ స్టేషన్) లొ సిమెంట్ రోడ్లు నిర్మించి , ఎ.పి.యస్.ఆర్.టి.సి రిజర్వేషన్ కేంద్రాన్ని ఏర్పాటుచేయాలి.
  5. గురజాల మండల ప్రజలు హైదరాబాద్ వెళ్ళేందుకు వీలుగా రాత్రి సమయంలో పిడుగురాళ్ళ డిపో నుండి గురజాల, మాచర్ల మీదుగా ఆర్.టి.సి బస్ సౌకర్యం కల్పించాలి.
  6. గురజాల-నర్సరావుపేట, గురజాల-వినుకొండ, గురజాల-మిర్యాలగూడ, గురజాల-నాగార్జున సాగర్ బస్ సర్వీసులు ప్రారంభించాలి.
  7. అగ్ని ప్రమాదాల ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణం స్పందించేందుకు వీలుగా అగ్ని మాపక కేంద్రం నిర్మించాలి.
  8. గురజాల రైల్వే గేట్ హాల్టు లో ప్రయాణీకుల సౌకర్యార్ధం రైల్వే రిజర్వేషన్ కేంద్రం ఏర్పాటుకు ఈ ప్రాంత నాయకులు ప్రయత్నించాలి.
  9. వరి,ప్రత్తి,మిర్చి అధికంగా పండించే ప్రాంతం కనుక రైతులకు అనుకూలంగా ఉండేందుకు కోనుగోలు కేంద్రాలు, ప్రభుత్వ గోదాములు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి.
  10. గురజాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానాన్ని మిని స్టేడియం గా అభివృద్ధి చేయాలి.
  11. గురజాల మరియు చుట్టుప్రక్కల గ్రామాలను అనుసంధానించే రోడ్లను మెరుగుపర్చాలి.
  12. రాబోవు 5 సంవత్సరాల్లో గురజాల మండలంలోని వీధులన్నిటికి సిమెంట్ రోడ్లు మంజూరుచేయాలి.
  13. గురజాలలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, ఆసుపత్రుల్లో, పాఠశాలల్లో మరియు కళాశాలల్లో ఇంకుడు గుంతలు నిర్మించి భూగర్భ జలాలు పెంచేందుకు కృషి చేయాలి.
  14. తాగునీటి ఎద్దడి ఉన్న వీధుల్లో ప్రభుత్వమే బోర్లు వేయించాలి.
  15. నియోజకవర్గ కేంద్రమైనప్పటికీ అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న గురజాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి మునిసిపాలిటి స్థాయికి అభివృద్ధి చేయాలి.
  16. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో నెల కొక సారి గురజాల మండల ప్రజల సమస్యలు , అభివృద్దికై తీసుకోవాల్సిన చర్యలపైన సమీక్షించాలి.
  17. అంటువ్యాధులకు కారణమయ్యే దోమల నివారణకు పక్షం రోజులకొకసారి ఫాగింగ్ జరిపేలా పంచాయితీ అధికారులను ఆదేశించాలి.
  18. మాచర్ల- గురజాల - దాచేపల్లి మార్గాన్ని 4 వరసలుగా విస్తరించాలి.  



Gurazala News:

http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/new-gurazala-revenue-division-created/article4868383.ece

Saturday, July 12, 2014

బాబు, మోడి లు దృష్టి పెట్టాల్సిన 10 అంశాలు




  1. ధనికులు కూడా ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం కోసం బారులు తీరేలా చేయాలి. అత్యుత్తమ వైద్యం సామాన్యుడికి అందించేందుకు  ప్రభుత్వాసుపత్రుల ప్రమాణాలు పెంచాలి. చౌక ధరల్లో ఔషద మందులు (మెడిసిన్స్) లభించేలా ప్రభుత్వాసుపత్రుల్లో జనరిక్ ఔషద దుకాణాలు ఏర్పాటు చేయాలి. 
  2. ప్రభుత్వ పాఠశాలలు (స్కూల్స్),కళాశాలల (కాలేజెస్) విద్యార్ధులు పోటి పరీక్షల్లో ప్రధమ స్థానంలో నిలవాలి. లక్షలు పోసి చదువు కొనే దుస్థితిలో మార్పు తేవాలి.   ఇ-భోదన జరగాలి. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివి రాణించివారికి ప్రోత్సాహకాలివ్వాలి.
  3. రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో , మొదటి 10 నిమిషాల్లో స్పందించి బాధితులను ఆదుకొని వారి ప్రాణాలు నిలిపే వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ప్రతి మండలానికొకటి చొప్పున 108 వాహనాన్ని, అగ్ని మాపక వాహనాన్ని (ఫైర్ ఇంజన్) సమకూర్చాలి.
  4. అన్ని వృత్తుల్లోకెల్లా వ్యవసాయానికి అధిక ప్రాధాన్యమివ్వాలి. రైతన్నలు వారు పండించిన పంటకు మద్దతు ధర సంవత్సరమంతా లభించేలా చర్యలు తీసుకోవాలి. దళారుల నివారణకు కఠిన శిక్షలు అమలు చేయాలి. గోదాములు (గోడౌన్) నిర్మించి వర్షం బారి నుండి వ్యవసాయోత్పత్తుల నిల్వలను రక్షించాలి.
  5. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో , విద్యా సంస్థల్లో , ప్రభుత్వాధీనంలోని ఖాళీ స్థలాల్లో ఇంకుడు గుంతలు నిర్మించేలా ఆదేశాలివ్వాలి. తద్వారా భూగర్భ జలవనరులను భావి తరాల కోసం పరిరక్షించాలి.
  6. పాలనలో అవినీతి అంతమొందించాలి. నిఘా కెమెరాలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ శాఖలు , పరిపాలన వ్యవహారాలు అంతర్జాలం ద్వారా సాగాలి.  ఐడియా బ్యాంకు ప్రభుత్వ కార్యాలయాల్లో నెలకొల్పి ఉత్తమ సూచనలు , సలహాలిచ్హే ప్రభుత్వోద్యోగులకు తగిన ప్రోత్సహాకాలు ఇవ్వాలి.
  7. వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాలు స్థాపించి యువతని పరిశ్రమల అవసరాలకనుగుణంగా తీర్చిదిద్దాలి. కొత్తగా వచ్చే పరిశ్రమలకు అవి సృష్టించే ఉద్యోగాల సంఖ్య ఆధారంగా రాయితీలు , ప్రాధాన్యత ఇవ్వాలి.
  8. మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యమివ్వాలి. మహిళల రక్షణకై ఒక టోల్ ఫ్రీ నంబర్ ప్రారంభించాలి. మహిళలపై తెగబడే వారిని కఠినంగా శిక్షించాలి.
  9. దేశ రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా పని చేయాలి. ఉగ్రవాద దాడులు , అల్లర్లు జరగకుండా ఇంటెలిజన్స్ , రా వంటి సంస్థలను పటిష్ట పరచాలి.ఎన్.యస్.జి, ఆక్టోపస్, గ్రే హౌండ్స్ దళాల సిబ్బంది అత్యవసర, విపత్కర పరిస్థితుల్లో తక్షణమే స్పందించేలా కార్యాచరణ రూపొందించాలి.
  10. నిత్యావసరాల ధరలకు కళ్ళెం వేయాలి. అక్రమంగా గోదాముల్లో నిత్యావసరాలను ఉంచి కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెరగడానికి కారణమయ్యే వారు ఎంతటి వారైనా కటకటాలు లెక్కించేలా చేయాలి.  

Saturday, March 8, 2014

సీమాంధ్రని స్వర్ణాంధ్రగా మార్చాలంటే ఏం చేయాలి?

                                 
                                      గతం గత: గతం నుండి పాఠాలు నేర్చుకుని, వర్తమాన పరిస్థితులకు తగ్గట్లుగా వ్యవహరించి భవిష్యత్ ప్రణాళికలు సిద్దం చేసుకోవడమే వివేకవంతుల లక్షణం. ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ఒక ప్రాంత ప్రజలకు మోదాన్ని, మరో ప్రాంత ప్రజలకు ఖేదాన్ని మిగిల్చిందనేది వాస్తవం. ఈ సమయంలో సీమాంధ్ర ప్రాంతాలతో ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రం ఏర్పాటు కాబోతుంది. మరి మన సీమాంధ్ర ప్రాంతాన్ని స్వర్ణాంధ్ర గా మలుచుకోవాలంటే ఏం చేయాలో తెలియజేసే నా ముఖ్యమైన సూచనలు.


                            


--అన్ని పెట్టుబడులు, కార్యాలయాలు, మౌలిక వసతులు ఒకే చోట కేంద్రికృతం కాకుండా చూడాలి. హైదరాబాదు విషయంలో చేసిన పొరపాట్లు మరలా చేయకూడదు.

-- కొత్తగా ఏర్పాటుకాబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన ప్రత్యేక ప్రతిపత్తి హోదాని పదేళ్ళకు పొడిగించేలా ఎన్నికల తరువాత వచ్చే కొత్త ప్రభుత్వం కృషి చేయాలి.

-- రాజధాని విషయంలో వైషమ్యాలు సృష్టించే రాజకీయ నాయకులతో అప్రమత్తంగా ఉండాలి. రాజధాని కేవలం పరిపాలనా వ్యవహారాలకు మాత్రమే కేంద్రంగా ఉండేలా చూడాలి.
ఉదాహరణ: గాంధీ నగర్ (గుజరాత్), కాన్ బెర్ర (ఆస్ట్రేలియా)

-- గుజరాత్ తరువాత భారతదేశంలో అత్యధిక తీర ప్రాంతం(972 కి.మి) ఉన్న రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్.

-- గంగవరం, కృష్ణ పట్నం, దుగ్గరాజపట్నం, కాకినాడ, నిజాం పట్నం, మచిలీపట్నం నౌకాయాన కేంద్రాలను( పోర్ట్స్) విశాఖపట్నం తరహాలో భారీ నౌకాయాన కేంద్రాలుగా, సరకు ఎగుమతి దిగుమతులకు వీలుగా, కంటైనర్ రవాణా కేంద్రాలుగా అభివృద్ధి  చేసుకోవాలి.

-- విభజన తరువాత ఉన్న అవశేష ఆంధ్రప్రదేశ్ వ్యవసాయాధారిత రాష్ట్రం కనుక రాబోయే పాలకులు, కాబోయే ముఖ్య మంత్రులు అత్యంత ప్రాధాన్యం వ్యవసాయ రంగానికివ్వాలి.

-- వృధాగా సముంద్రపాలు అవుతున్న గోదావరి నీటిని నిలువ చేసి, లక్షల ఎకరాలను సస్యశామలం చేస్తూ, కృష్ణా గోదావరి నదులను అనుసంధానించే పోలవరం బహుళార్ధ సాధక పధకాన్ని కేంద్ర నిధులతో వీలైనంత త్వరగా సాకారం చేసుకోవాలి.
-- రైతులందరికి కలగా మారిన పంట సాగుకు సకాలంలో నీరు, అందు బాటు ధరల్లో యూరియా ఇంకా ఇతర క్రిమి సంహారక మందులు, పండించిన పంటకు సరియైన ధర, దళారీ వ్యవస్థ నిర్మూలన నిజమవ్వాలి. వ్యవసాయం పైన ఆధార పడ్డవారంతా  గర్వ పడేలా చేయాలి. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి.

--విశాఖపట్నం, గన్నవరం, తిరుపతి విమానాశ్రయాలను శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తలదన్నేలా నిర్మించాలి.

--ఇప్పటికే ఉన్న చిన్న విమానాశ్రయాల రన్ వే లను పెద్ద విమానాలు దిగేందుకు వీలుగా విస్తరించాలి. రాత్రి సమయంలో విమాన రాకపోకలకు అనుగుణంగా స్థాయి పెంచాలి.

--తీర పర్యాటక ప్రాంతాలకు, ప్రముఖ పుణ్యక్షేత్రాలకు రోడ్డు, రైలు , వాయు రవాణా మార్గాలు మెరుగుపర్చాలి.

--ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక రైల్వే జోన్ కోసం పోరాడాలి.

--సౌర శక్తి, పవన శక్తికి అధిక ప్రాధాన్యమిచ్చి రాష్ట్రాన్ని కాలుష్య కాసారంగా మార్చే బొగ్గు ఆధారిత విద్యుత్కేంద్రాలపైన ఆధారపడటం క్రమంగా తగ్గించుకోవాలి.

--ఐ.టి/ఐ.టి.యి.యస్ ఆధారిత పరిశ్రమల విసృతి కోసం అన్ని ద్వితీయ శ్రేణీ నగరాల్లో సైబర్ టవర్స్ (ఐ.టి వాణిజ్య కార్యకలాపాల భవన సముదాయం)ని నిర్మించాలి.

--హైదరాబాద్ కి కేంద్రం ప్రకటించిన  ఐ.టి.ఇన్వెస్ట్మెంట్ రీజీయన్(ఐ.టి.ఐ.ఆర్) ని విశాఖకు విస్తరించాలి. రాజకీయ నాయకులు ఈ హోదా కోసం పోరాడాలి.

--విభజన తరువాత ప్రముఖ విద్యాలయాల లోటుతో ఉన్న సీమాంధ్ర ప్రాంతం లో ఐ.ఐ.టి,ఐ.ఐ.ఎం,ఐ.ఐ.ఐ.టి,ఎన్.ఐ.టి,కేంద్రీయ విస్వ విద్యాలయాలు, వ్యవసాయ విద్యాలయాలు రానున్న ఐదేళ్ళలో ఏర్పాటుచేసుకోవాలి.






--విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి లను కలుపుతూ మెట్రో , విశాఖపట్నం లో మెట్రో రవాణా వ్యవస్థని అభివృద్ది చేసుకోవాలి.

--ప్రత్యేక హోదా పదేళ్ళ పాటు ఉన్న రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు తయారీ రంగ కేంద్రాలుగా భాసిల్లేలా చర్యలు తీసుకోవాలి.

--ప్రజా రవాణా వ్యవస్థలను సీమాంధ్రలోని అన్ని జిల్లా కేంద్రాలలో పటిష్టం చేయాలి. కొత్తగా నగరాల్లో నిర్మించబోయే బాహ్య వలయ రహదారులను (అవుటర్ రింగ్ రోడ్డు) , నాలుగు వరుసల రహదార్లు లేక రెండు వరుసల రహదార్లు క్రమ పద్దతిలో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా, పాద చారుల బాటలతో , ప్రత్యేక సైకిల్ ట్రాక్ లతో , రోడ్డుకి సమాంతరంగా రైల్ వ్యవస్థ ఎర్పాటు చేసుకోగలిగే సౌలభ్యంతో బహుళ ప్రయోజనకరంగా  నిర్మించుకోవాలి. 

--అన్ని జిల్లా కేంద్రాలలో బస్సుల ద్వారా త్వరిత రవాణా విధానాన్ని(బస్ ర్యాపిడ్ ట్రాన్స్ పోర్ట్ సిస్టం -బి.ఆర్.టి.యస్ ) ని అమలు చేసే విధంగా రహదారులు విస్తరించాలి.

--కొత్తగా నిర్మించే ప్రభుత్వ కార్యాలయాలను హరిత భవనాలుగా (గ్రీన్ బిల్డింగ్స్) తీర్చిదిద్ది , ప్రైవేట్ సంస్థలు నిర్మించే హరిత భవనాలకు ప్రత్యేక రాయితీలివ్వాలి.

--ప్రభుత్వ పాలనా వ్యవహారాలు , వివిధ శాఖల కార్యకలాపాలన్నింటిని అంతర్జాలంలో(ఆన్లైన్) లో నిర్వహించేలా వెబ్ సైట్లు రూపొందించాలి. తద్వారా పరిపాలనలో పారదర్శకతకి(ట్రాన్స్పరెన్సీ) పెద్ద పీట 
వేసినట్లవుతుంది. 

--మారుమూల గ్రామాల్లో పల్లెలకు ప్రభుత్వ కార్యక్రమాలు,అభివృద్ది ఫలాలు చేరాలంటే పరిపాలనా సౌలభ్యం కోసం సీమాంధ్రలో ప్రస్తుతమున్న జిల్లాల సంఖ్యని 13 నుండి 25 కి పెంచాలి.

--కొత్త ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సుస్థిరత కోసం ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను 175 నుంది 225 కి పెంచాలి.

--యువతలో వృత్తి నైపుణ్యాలను పెంచి, ఉద్యోగాలకు సిద్దం చేసేందుకు వివిధ పరిశ్రమల సహకారంతో సీమాంధ్ర విశ్వ విద్యాలయాల్లో ప్రత్యేక వృత్తి విద్యా కోర్సులను  ప్రారంభించాలి.

--కొత్త రాష్ట్రంలో సినీ పరిశ్రమను విస్తరించేందుకు సీమాంధ్రకు చెందిన సినీ ప్రముఖులతో చర్చించి సినీ పరిశ్రమాభివృద్దికి అవసరమైన ప్రోత్సహకాలు కల్పించాలి.

--సీమాంధ్ర వర్ధమాన క్రీడాకారులందరికి అత్యున్నతమైన క్రీడా ప్రమాణాలతో హైదరాబాద్ లోని క్రీడా ప్రాంగణాలకు సమాన స్థాయిలో సీమాంధ్ర ప్రాంతం లో స్టేడియాలు అభివృద్ది చేసుకోవాలి. విశాఖ , విజయవాడ క్రికెట్ స్టేడియాలలో వసతులు మెరుగుపర్చాలి. ప్రతి మండల కేంద్రంలో ఒక స్టేడియం నిర్మించాలి.

--ప్రస్తుతమున్న కేంద్ర పరిశోధన సంస్థల విస్తరణతో పాటు, వ్యవసాయ సంబంధిత ప్రత్తి, మిరప, పొగాకు, చెరకు, మామిడి, అరటి, ఆపరాలు మరియు మత్స్య రంగాలకు చెందిన కేంద్ర పరిశోధన సంస్థల స్థాపనకై నిరంతరం కృషి చేయాలి. 

--తీరప్రాంత పోలీస్ స్టేషన్లను(మెరైన్ పోలీస్ స్టేషన్) పటిష్టపరిచి భద్రతని కట్టు దిట్టం చేయాలి. సముద్రంలో వేటకోసం వెళ్ళే పడవలకు ఒక గుర్తిపు సంఖ్య ఇవ్వాలి. లైట్ హౌస్ టూరిజం ని వృద్ది చేయాలి.

-- విశాఖ-చెన్నై పారిశ్రామిక మండలి (ఇండస్ట్రియల్ కారిడార్) ని కేంద్రం పైన ఒత్తిడి పెంచి సాధించుకోవాలి.

-- బెంగళూరు-చెన్నై పారిశ్రామిక మండలిలో భాగమైన చిత్తూరు-నెల్లూరు జిల్లాలో ఎర్పాటుకాబోయే పరిశ్రమల నుండి ఎగుమతి దిగుమతులకు అనుకూలంగా క్రిష్ణ పట్నం పోర్ట్ కి, తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి రోడ్డు, రైల్ రవాణా మార్గాలను మెరుగుపర్చాలి.

--సీమాంధ్రలో అధ్వాన్నంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లోని సౌకర్యాలను, ప్రభుత్వ బడుల్లో ఉన్న మౌలిక వసతులను యుద్ధ ప్రాతిపదికన మెరుగుపర్చాలి. 

--సమైక్య రాష్ట్రంలో అందని ద్రాక్ష గా మిగిలిన "పరిపాలనలో 100 శాతం తెలుగు వినియోగం" ని ప్రోత్సహించి తెలుగు రాష్ట్రంలో తెలుగు భాషకి పునర్ వైభవం తీసుకురావాలి. తెలుగు భాషోద్ధరణకు కృషి చేసే రాష్ట్రం గా అంధ్రప్రదేశ్ మిగలాలి. 

--జలయజ్ఞం లో ప్రాభించిన వివిధ ప్రాజెక్టులను ఒక ప్రణాళికా పద్దతిలో ఏవైతే తక్కువ పెట్టుబడితో,తక్కువ సమయంలో పూర్తై ఎక్కువ లాభాన్ని సీమాంధ్ర రైతులకు కల్గిస్తాయో పరిశీలించి వాటినే మొదట పూర్తి చేయాలి.   

--గ్రామాల్లో చెరువులు త్రవ్వించి, ఇంకుడు గుంతలు నగరాల్లో నిర్మించి, చెక్ డ్యాములు పర్వత ప్రాంతాల్లో కట్టించి భూగర్భ జలవనరులను కాపాడుకోవాలి.  

--పులిచింతల ప్రాజెక్టులో భాగంగా ఇంకా పూర్తి కాని పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి కృష్ణా ఆయకట్టు రైతుల పైర్లకు రాబోయే రబీ నుండి సాగు నీరందించాలి.

--జవహర్ లాల్ నెహ్రూ పట్టణ నవీకరణ పధకం కింద వచ్చే నిధులతో ఎ.పి.యస్.ఆర్.టి.సి ని పటిష్టం చేయాలి. ఆర్.టి.సి ని ప్రభుత్వంలో విలీనం చేయాలి.

--చేనేత పరిశ్రమకి ప్రోత్సహకాలివ్వాలి. ధర్మవరాన్ని భారతదేశంలోనే ప్రఖ్యాత పట్టు చీరల తయారీ కేంద్రంగా అభివృద్ధి చేసుకోవాలి.
-- హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గా పదేళ్ళు ప్రకటించినప్పటికీ కొత్తగా వచ్చే పార్టీ సీమాంధ్ర కార్యాలయాలతో సహా సీమాంధ్రకు అనుబంధమైన అన్ని సంస్థలు సీమాంధ్ర ప్రాంతంలోనే తమ కార్యాలయాలు నెలకొల్పి అక్కడ నుండే కార్యకలాపాలు నిర్వహించేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

--సభలు, సమావేశాల నిర్వహణకు అనువుగా ఉండేందుకు అత్యాధునిక వసతులతో కూడిన కన్వెన్షన్ సెంటర్లను విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి లలో నిర్మించాలి.

--ఆంధ్ర ప్రదేశ్ లో వై.యస్ హయాంలో కేంద్ర ప్రభుత్వం శంఖుస్థాపన చేసిన బి.హెచ్.ఇ.ఎల్-ఎన్.టి.పి.సి విద్యుత్ ఉపకరణాల తయారి పరిశ్రమ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ఈ కర్మాగారాన్ని త్వరగా పూర్తి చేసేలా ఆ సంస్థలపైన ఒత్తిడి తేవాలి.  



                          ఒక జిల్లాను వైద్య రంగంలో అగ్రగామిగా( హెల్త్ క్యాపిటల్) , మరో జిల్లాను పరిపాలనా కేంద్రంగా (అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్) , ఇంకో జిల్లాను విద్యాలయాలకు నెలవుగా( ఎడ్యుకేషన్ సెంటర్), ఆర్ధిక వ్యాపార రాజధానిగా(ఫైనాన్షియల్ క్యాపిటల్) మరో జిల్లాను, రవాణా కూడలి (ట్రాన్స్పోర్టేషన్ హబ్ )గా ఇంకో జిల్లాను, హార్డ్ వేర్ మరియు ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు ఒక చోట, వ్యవసాయ సంబంధిత పరిశ్రమలు మరో చోట, ఫార్మా మరియు గ్యాస్ రంగాలు ఒక ప్రాంతంలో, సిమెంట్ మరియు ఖనిజ పరిశ్రమలు మరో ప్రాంతంలో , పాలు మరియు మత్స్య ఆధారిత పరిశ్రమలు ఇంకో ప్రాంతంలో ప్రభుత్వ, ప్రైవేట్ పరిశోధనా కార్యాలయాలు వివిధ ప్రాంతాలలో ఇలా అభివృద్దిని పంచాలి. సమతులాభివృద్దిని సాధించాలి. సీమాంధ్ర సర్వతో ముఖాభివృద్దికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి. కొత్త ఆంధ్రప్రదేశ్ ని భారత దేశంలోనే అగ్రగామిగా నిలపాలి.

  ఎవరో ప్రముఖ కవి అన్నట్లుగా..
                     అనుకున్నామని జరగవు అన్నీ,
                     అనుకోలేదని ఆగవు కొన్నీ,
                     జరిగేవన్ని మన మంచికని,
                     అనుకోవడమే మనిషి పని.

                      రాష్ట్రాలు రెండైనా తెలుగు ప్రజలంతా ఒక్కటేనని రాజకీయ నాయకులు, రెండు ప్రాంతాల ప్రజలు గుర్తించాలి. తెలుగు ప్రజలకు మేలు జరిగే అన్ని సందర్భాలలో సమైక్యంగా ప్రాంతాలకతీతంగా వాణి వినిపించి తామంతా ఒక్కటే అని నిరూపించాలనేది నా చిన్న కోరిక.  

  

Saturday, February 1, 2014

ఓటు తప్పకుండా వేయ్..మార్పు తీసుకురావోయ్ (Let's Vote)






నిజాయితీ లేని నాయకుల భవితకు సమాధి కట్టే ఇటుక ఓటు.
అవినీతి వ్యవస్థల దుమ్ము దులిపే చీపురు ఓటు.
కుళ్ళిపోయిన రాజకీయాలకు చికిత్స చేసే ఔషధం ఓటు.
అభివృద్ధి ఫలాలు అట్టడుగు ప్రజలకు అందించే మార్గం ఓటు.
దేశాన్ని ప్రేమించే సచ్ఛీల నాయకులను చట్ట సభలకు పంపే అధికారం ఓటు.
నిరుద్యోగాన్ని రూపు మాపి యువతకు దారి చూపే స్థైర్యం  ఓటు.
ధనబలంతో రాజకీయాలను శాసించే మద గజాలను నియంత్రించే అంకుశం ఓటు.
జాతి,మత,ప్రాంత,కుల వైషమ్యాలను పెంచే వారికి చరమగీతం ఓటు
నేటి బాలల, రేపటి పౌరుల ఆశల భారతానికి వారధి ఓటు.
సువర్ణ,సుభిక్ష  భారతాన్ని భవిష్యత్ తరాలకు అందించే వజ్రాయుధం ఓటు.



Monday, January 6, 2014

నా తెలుగు కవితలు







ప్రియా,
ముత్యాలతో నీ మేనికి నగలు చేయిస్తా,తారలతో నీకు మేడలు కడతా,
నీతో ఊహలలో విహరిస్తా,సృష్టి లోని సౌందర్యాన్ని నీకు పరిచయం చేస్తా,
నీ ఇష్టాన్ని స్వాగతిస్తా,నీకై తపించే నా హృదయాన్ని నీకు బహుమతి గా ఇస్తా,
సూర్య చంద్రులు కనుమరుగైనా ,సునామీలు ఎన్నొచ్చినా నీకు నేతోడుంటా.


సంతోషం నాతో చెలిమి చేస్తానని,
ఆనందం నా చిరునామాని మర్చిపోనని,
షికారు నేను లేకపొతే హుషారుగా ఉండనని ,
ఉత్సాహం నా వెంటే పరుగు తీస్తానని,
విషాదం నా దరిదాపులకి చేరనని,
నమ్మకం నా మాటలతో కలిసి నడుస్తానని,
హామీలిచ్చాయి..అదే నిజమైతే ప్రతిది నా సొంతమే.


నా చెలికి,
నిండు జాబిలితో మాటలంటే ఇష్టం,
కోనేటి గట్టున జలకాలాట ఇష్టం,
ప్రకృతి ఒడిలో పరవశించడం ఇష్టం,
జోరు వానలో చిందులంటే ఇష్టం,
చీరకట్టుతో మైమరపించటం ఇష్టం,
నవ్వుతూ నవ్విస్తూ ఉండటం ఇష్టం.



అమ్మ చేతి గోరు ముద్దలు,
నాన్నతో చెప్పే రాత్రి కబుర్లు,
స్నేహితుల అనురాగాలు,
బంధువుల ఆప్యాయతలు,
ప్రియురాలితో సరసాలు,
బుజ్జాయితో ఆడే ఆటపాటలు,
సృష్టిలోనే అతి మధురమైనవి.



చల్లని గాలులు హృదయానికి హత్తుకుపోతే,
కారు మబ్బులు కరిగి జడి వాన మొదలైతే,
ఆకాశాన హరివిల్లు కనులవిందు చేస్తుంటే,
పురి విప్పిన నెమలి నాట్యపు హొయలొలికిస్తే,
కమ్మని సంగీతం గిలిగింతలు పెడుతుంటే,
వెచ్చని తోడు కోసం మది ఆరాటపడుతుంటే,
ఆ హాయి కి ఇలలో సాటి లేనే లేదోయి.



ఓ ప్రియతమా,
మనసు మురిసినా, మది కలలతో మెరిసినా,
మాటలు తడబడినా, అడుగులు జరగనంటున్నా,
చూపులు మత్తెకించినా, సిగ్గులు షికార్లు చేస్తున్నా,
శ్వాస ఆశతో నిండినా, ఊహలు ఉరకలేస్తున్నా,
అది నీ వల్లే..నీ వల్లే

India in Modi Rule 2014-24

Translate